సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ అంబటి రాంబాబుతో ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ ములాఖత్ అయ్యారు. అనంతరం ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రుల ఇల్లు తగలపెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందని.. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇలాంటి విధానం రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు.
‘‘కల్తీ రిపోర్టు వచ్చింది. సారీ చెప్తున్నానని చంద్రబాబు చెప్పుంటే గౌరవం పెరిగి ఉండేది. తప్పించుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు.. మీరు చేసే పనులు బాగోలేదు.. మీలో మార్పు రావాలి. దేశంలో మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన అరాచకం ఎక్కడా జరగలేదు’’ అని ముద్రగడ పేర్కొన్నారు.
పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఓటు ద్వారా అధికారం లభిస్తే చంద్రబాబు మళ్లీ ఆటవిక పాలనలోకి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో బాధితులు ముద్దాయిలవుతున్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందని పోస్టర్లు వేయటం ఎంత దారుణం. అంబటి ఇంటిపై దాడి చేసిన 5 గంటల పాటు పోలీసులు నిస్తేజంగా ఉండిపోవటం దారుణం. దాడి సమయంలో ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బాధితులను చంద్రబాబు నిందితులుగా మారుస్తున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
..ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని అంబటి చెప్పారు. జైల్లో మాజీ మంత్రికి ఇవ్వాల్సిన మినిమం ప్రివిలైజేస్ కూడా ఫాలో కావటం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని తెలియజేయటానికి వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రజా పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదు’’ అని వేణుగోపాలకృష్ణ తేల్చి చెప్పారు.


