పెద్దపులిని కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు
● మేన్ ఈటర్గా మారితే
బాధ్యులెవరు?
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రాజానగరం: ఐదు రోజులుగా పెద్దపులి సంచారంతో ప్రలు వణికిపోతుంటే అధికార పార్టీ పెద్దలు మాత్రం దానిని పట్టుకోవడంలో శ్రద్ధ పెట్టకుండా ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం మండలాలలో ప్రజలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారని, రైతులు పొలాలకు వెళ్లడం లేదని, మూగ జీవాలు బలైపోతున్నాయని, అయినా ప్రభుత్వం పెద్దపులిని పట్టుకోలేకపోతోందన్నారు. అధికార పార్టీ పెద్దలు మాత్రం ఈ పులి సంచారాన్ని వీడియోలు తీసి, ప్రచారంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలోనూ మీనమేషాలు లెక్కిస్తూ, పెద్దపులి జాడను కనిపెట్టలేని దుర్భర స్థితిలో పాలన ఉండడం విచారకరమన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో పులి సంచరించినప్పుడు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన పెద్దపులిని పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదలిపెట్టే చర్యలు తీసుకోవాలన్నారు.


