రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలోల రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నారు. రాజానగరం ఎంఎస్ఓ బాపిరాజు కథనం ప్రకారం.. వివిధ రంగుల్లో ఉన్న 311 ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసిన ఈ బియ్యాన్ని గోపాలపురం నుంచి రాజానగరానికి తరలిస్తున్నారు. దీని విలువ రూ. 8,43,510 ఉంటుందని అంచనా. ఈ మేరకు గొల్లప్రోలుకు చెందిన లారీ డ్రైవర్, ఓనర్లు అల్లు శ్రీనివాస్, చోడిశెట్టి మహేష్లపై 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యంతో కూడిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
అనపర్తి: విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుతుకులూరు గ్రామంలో జరిగిందని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండపేట మండలం వేములపల్లికి చెందిన కాపా ధర్మయ్య (53) భార్య బోదమ్మతో కలసి నాలుగేళ్లుగా కుతుకులూరులో ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ఆ బట్టీలోనే వారంతా నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ధర్మయ్య మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత అతని అరుపులు వినిపించడంతో బోదమ్మ వెంటనే అక్కడికి వెళ్లగా, లైటింగ్ అవసరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని చేతితో పట్టుకోవడం వల్ల అతనికి విద్యుత్ షాక్ పడిపోవడం గమనించింది. తక్షణమే అతనిని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ఆలమూరు: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు కె.ధర్మాజీ ఎంపికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ధర్మాజీని సెలక్టర్లు ఈ కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 9 నుంచి 14 వరకూ ఛండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ధర్మాజీ పాల్గొనున్నాడు. నాలుగేళ్ల నుంచి వరుసగా కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
రేషన్ బియ్యం స్వాధీనం


