అగ్గి.. కష్టం బుగ్గి
● మురమండలో పాక దగ్ధం
● కన్నీరుమున్నీరైన వలస కూలీలు
కడియం: కూలీల కష్టం బుగ్గి అయ్యింది.. కడియం మండలం మురమండ శివారులోని పొలం వద్ద తాటాకు పాక పూర్తిగా కాలిపోయింది. అందులో వలస కూలీలు దాచుకున్న దాదాపు రూ.నాలుగు లక్షలు, వారి దుస్తులు, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గున్నంపూడి గ్రామానికి చెందిన 12 కుటుంబాలకు సంబంధించిన 21 మంది రెండు నెలల క్రితం మురమండ గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చారు. అదే గ్రామానికి చెందిన అంకం సత్తిపండుకు చెందిన పొలంలోని పాకలో నివాసం ఉంటున్నారు. వీరంతా వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని, కూలి డబ్బులు పోగుచేసుకుని తమ గ్రామానికి వెళ్లిపోతారు. ఒకటి రెండు రోజుల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి రావాల్సిన కూలి డబ్బులను పోగు చేసుకుని వారు నివాసం ఉండే పాకలోని పెట్టెలో భద్రపరుచుకుని, ఎప్పటిలాగే సోమవారం కూడా పనులకు వెళ్లిపోయారు. అయితే ఉన్నట్టుండి సదరు పాకకు నిప్పు అంటుకోవడంతో కూలీలు దాచుకున్న డబ్బుతో పాటు, వారి దుస్తులు, రెండు మోటారు సైకిళ్లతో సహా మొత్తం కాలిబూడదైంది. స్థానికులు అనపర్తి అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు. పనులకు వెళ్లిన కూలీలు ప్రమాద విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చి తమ కష్టార్జితం బుగ్జిపాలు కావడంతో కన్నీరు మున్నీరయ్యారు.
అగ్గి.. కష్టం బుగ్గి


