15 కిలోల గంజాయి పట్టివేత
ఎటపాక: ఆటోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎటపాక పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కన్నపరాజు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై అప్పలరాజు నెల్లిపాక జాతీయ రహదారిపై ఉన్న అటవీ శాఖ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 15 కిలోల గంజాయి ఉండటంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అడపా రాకేష్, కణితి సాయిరామ్లు తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడకు ఒడిశా రాష్ట్రం నుంచి ఆటోలో గంజాయి తరలిస్తున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పారిపోయారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.


