పులిని బంధించడంలో ప్రభుత్వం విఫలం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద పులిని బంధించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం సక్రమంగా జరగడం లేదని అన్నారు. రాత్రయితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. రైతులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. చనిపోయిన పశువులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి యజమానులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పది పశువులను చంపినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప, పులిని బంధించే ప్రయత్నం కనిపించడం లేదని విమర్శించారు. సాంకేతికత పెరిగినా పులి జాడ కనిపెట్టడంలో విఫలం కావడం శోచనీయమని అన్నారు. పులిని పట్టుకునే ప్రయత్నాల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రద్ధ చూపకపోవడం దారుణమని అన్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నా కనీసం స్పందించక పోవడం సరైన విధానం కాదన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తక్షణ మే పశువులు కోల్పోయిన పాడి రైతులకు రూ.మూడు లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రానున్న 12 గంటల్లో పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాన్ని అటవీ శాఖాధికారులు ముమ్మరం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని వేణు, రాజా హెచ్చరించారు.
మాజీ మంత్రి వేణు,
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా


