‘కూటమి’లో ఇసుక ర్యాంపుల వివాదం
తాళ్లపూడి: కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇసుక ర్యాంపుల విషయంలో నాయకుల మధ్య చిచ్చు రేగింది. దీంతో వేగేశ్వరపురం ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో జరిగే ఇసుక అక్రమాలపై ఇకపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని జనసేన నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు హరిబాబు విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా మండలంలో మాత్రం జనసేనను దూరంగానే ఉంచుతున్నారని, టీడీపీ వర్గీయులు జనసేన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇసుక ర్యాంపులన్నీ టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారని, తమను చేతకానివారిగా చూస్తున్నారని అన్నారు. ఇసుక ర్యాంపుల్లో జరిగే తప్పులపై అందుకే గళం విప్పామని, ఎన్డీఏలో తాము భాగస్వామ్యమా? కాదా? తెలియకుండా ఉందని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు.


