ఎత్తిపోతలపై తమ్ముళ్ల ఎత్తులు!
● టీడీపీ రాజకీయాలకు వేదికగా
వేగేశ్వరపురం ఎత్తిపోతల పఽథకం
● రైతు సంఘం నుంచి ప్రత్యేకాధికారి
పాలనలోకి..
● రెండు వర్గాలుగా టీడీపీ నాయకుల పోటీ
● నిధుల కోసమేనా పదవులపై ఆశ?
తాళ్లపూడి : రైతు సంఘం నిర్వహణలో 28 సంవత్సరాలుగా ఉన్న వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం టీడీపీ నాయకుల విభేదాల కారణంగా ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ పథకం కూటమి నాయకుల రాజకీయాలకు వేదికగా మారింది. మరోపక్క ఎత్తిపోతలకు వచ్చే నిధుల కోసమే పదవులపై ఎవరికి వారు కన్నేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బకాయిల భారం : పెద్ద రైతులు, నాయకులు నీటి తీరువా కట్టకుండా పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టినట్టు సమాచారం. రూ.1.11 కోట్ల వరకు పన్ను బకాయిలున్నాయి. బకాయి దారుల్లో ప్రస్తుతం పదవిని ఆశిస్తున్న టీడీపీ నాయకులు కూడా ఉండడం గమనార్హం. 2017లో పథకం ఆధునికీకరణకు రూ.8.32 కోట్లతో పనులు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పెట్టిన నేపథ్యంలో టీడీపీలో ఒక వర్గం వారు అధికారం తమ వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో వేగేశ్వరపురం, బల్లిపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇరిగేషన్ అధికారులకు ఒక లేఖ రాశారు. రైతుల నుంచి ఆరోపణలు వచ్చాయని ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిని తొలగించి జీవో 41ను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆ మేరకు 31వ తేదీ నుంచి ఈ పథకం ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లింది. కొన్నాళ్లు ప్రత్యేకాధికారి పాలన కొనసాగాక పార్టీలో తమ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఈ పథకం అధ్యక్షుడిగా నియామకం పొందాలని తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
స్టేటస్ కో ఎత్తివేత
ఎన్నికలు నిర్వహించకుండా 2022లో తమకు నిర్వహణ అవకాశం కల్పించాలని రైతు సంఘం హైకోర్టులో కేసు వేసింది. దీంతో అధ్యక్షుడిగా ఉన్న కై గాల రాంబాబుకు అనుకూలంగా కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇటీవల రాజకీయ ఒత్తిడితో ఆయన కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడంతో కోర్టు స్టేటస్ కో ఎత్తివేసింది. అయితే ఎత్తిపోతల పథకాన్ని అధికార పార్టీ రాజకీయంలోకి లాగడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ పథకం ద్వారా వేగేశ్వరపురం, తిరుగుడుమెట్ట, పెద్దేవం, బల్లిపాడు, కుక్కునూరు, చిడిపి, మలకపల్లి, గ్రామాల్లో 3,400 ఎకరాలకు నీరు అందుతుంది.
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు
41 జీవో ప్రకారం నేను ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. జనవరి 31 నుంచి పథకం నిర్వహణ చూస్తున్నా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటా. రైతు సంఘం రికార్టులు అప్పగించాల్సి ఉంది.
–గురవయ్య, ఏపీఎస్ఐడీసీ ఈఈ,
ఎత్తిపోతలపై తమ్ముళ్ల ఎత్తులు!


