ఘనంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలు
గజవాహనంపై స్వామి గ్రామోత్సవం
కోరుకొండ: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు 3వ రోజు శనివారం ఘనంగా జరిగాయి. స్వామివారి దత్తత దేవస్థానమైన అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయం, వ్యవస్థాపక ధర్మకర్త పరాశర రంగరాజ భట్టర్ ఆధ్వర్యంలో ఈ అధ్యయన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయిన ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రతీరోజు ఉదయం 9–30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తున్న దర్శనాల్లో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాలకు సుధూర ప్రాంతాల నుంచీ భక్తులు హాజరవుతున్నారు.
గ్రూప్–1 ఫలితాల్లో
శ్రీరమణి సత్తా
స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా ఎంపిక
నిడదవోలు రూరల్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన ద్రోణంరాజు శ్రీరమణి సత్తా చాటారు. స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఎంపికయ్యారు. తండ్రి నరసింహారావు ప్రైవేటు చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేయగా, తల్లి సుధ గృహిణి. శ్రీరమణీ నిడదవోలులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ చదివి, ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేశారు. శ్రీరమణి యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటి సివిల్స్ సాధించడమే తన లక్ష్యంగా కృషిచేస్తానని శనివారం తెలిపారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు నాలుగుసార్లు హాజరుకాగా అర్హత సాధించలేదని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఎంతో ఆనందంగా ఉందని శ్రీరమణి చెప్పారు. తమ గ్రామానికి చెందిన యువతి శ్రీరమణి గ్రూప్–1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అభినందించిన గ్రామస్తులు
శ్రీరమణి డి.ముప్పవరం గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిందని సర్పంచ్ నాగిరెడ్డి నాగదేవి గ్రామస్తులు కొనియాడారు.
ఘనంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలు


