పులి సంచరిస్తోంది.. అప్రమత్తం!
● చినకొండేపూడి–పెదకొండేపూడి మధ్య పాదముద్రల గుర్తింపు
● అవి పులివేనని ధ్రువీకరించిన
రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజు
సీతానగరం: మండలంలోని చినకొండేపూడి – పెదకొండేపూడి పంట పొలాల్లో పులి పాద ముద్రలను స్థానికుకులు గుర్తించి శనివారం అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వాటిని పులి పాద ముద్రలేనని ధ్రువీకరించారు. స్థానిక గెడ్డం రామకృష్ణ పంట పొలంలో గుర్తించిన ఆ పాద ముద్రలపై స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు జిల్లాలో ఇటీవల తిరుగుతున్న పులి ఇక్కడికి వచ్చి ఉండవచ్చని భావించిన రాజమహేంద్రవరం అటవీశాఖ రేంజ్ అధికారి ఎన్.దావీద్ రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా రేంజ్ అధికారి కొండలరావు తమ సిబ్బందితో క్షేత్రస్థాయికి వెళ్లి పాద ముద్రలను పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ ఎ.శ్రీనివాస్, ఎస్సై డి.రామ్ కుమార్ అక్కడికి చేరుకుని అటవీశాఖాధికారులో చర్చించారు.
అనంతరం అటవీ రేంజ్ అధికారి దావీదురాజు విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలవరం దగ్గరలో ఇటుక కోటలో శుక్రవారం రాత్రి పులి రెండు దూడలపై దాడి చేసి హతమార్చిందని, అక్కడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం వైపు వచ్చిందని, కాలువ వద్ద రాళ్లు ఉండటంతో పాద ముద్రలు పడలేదన్నారు. గోదావరి దాటి చినకొండేపూడి వైపు వచ్చిందన్నారు. ఆ పులి పాదముద్రలు, ఇక్కడ పాదముద్రలు ప్లగ్ మార్క్ ఒకటేనని గుర్తించామన్నారు. పులి పెదకొండేపూడి మీదుగా పురుషోత్తపట్నం అడవి వైపు వెళ్తున్నట్టుగా పాద ముద్రలు ఉన్నాయని తెలిపారు. పంట పొలాల్లోను, పెదకొండేపూడి గోశాల వద్ద, అనుమానిత ప్రాంతాల్లో సెన్సార్ ట్రాప్ కెమెరాలు అమర్చామని తెలిపారు. రైతులు ఎక్కడైనా పులి పాదముద్రలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు తమ పొలాలకు ఉదయం 8 గంటల తరువాతే వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తరువాత పంట పొలాల్లో ఉండవద్దని హెచ్చరించారు. పశువులను సాధ్యమైనంత వరకు గ్రామాల్లో కట్టుకోవాలని, లైట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళ బయటకు వెళ్లాల్సి ఉంటే గుంపులుగా వెళ్లాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి
చినకొండేపూడి, పెదకొండేపూడి, చీపురుపల్లి, అచ్చియ్యపాలెం, నాగంపల్లి, పురుషోత్తపట్నం, మండలంలోని గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై రామ్ కుమార్ హెచ్చరించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పులి సంచరిస్తోంది.. అప్రమత్తం!


