భారతదేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ను నేడు ( ఫిబ్రవరి 1న) పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఖర్చుల ప్రకటన మాత్రమే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ దేశ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.11. 24 లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడ్డతారు ఎందుకు..? ఎప్పటి నుంచి ఇలా మొదలైంది..వంటి ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!.
నిజానికి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు కాదు. గతంలో ఫిబ్రవరి చివరిలో ప్రవేశపెట్టేవారు. 2016 వరకు, భారతదేశం బిటిష్ కాలం నాటి విధానంలోనే..ఫిబ్రవరి చివరి పనిదినాన బడ్జెట్ను ప్రవేశపెట్టేది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. దాంతో మంత్రిత్వ శాఖలు, వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాలు, పన్ను నిబంధనలపై చర్యలు తీసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉండేంది. బడ్జెట్ ఆమోదం పొంది, అమలులోకి వచ్చేసరికి, కొత్త ఆర్థిక సంవత్సరం అప్పటికే ప్రారంభమైపోయేది. ఫలితంగా, అనేక ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలు సమయానికి ప్రారంభమయ్యేవి కావు, ఆలస్యమయ్యేవి.
ఈ విధానం ఎప్పటి నుంచి అంటే..
2017లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారిగా ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి, ప్రభుత్వం ఈ ముందస్తు తేదీనే కొనసాగిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపు అందరికీ ప్రణాళికలు వేసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడమే దీని ప్రదాన లక్ష్యం.
అదేవిధంగా, వలసవాద కాలం నుంచి అనుసరిస్తున్న బడ్జెట్ సమయాన్ని కూడా మార్చారు. 1999 వరకు, బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఎక్కువ మీడియా కవరేజ, మెరుగైన ప్రజా భాగస్వామ్యం కోసం సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
తేదీ మార్పుతో రాజుకున్న వివాదం..
ప్రభుత్వం ఈ మార్పును ప్రకటించిన వెంటనే, ఈ చర్యను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రజాకర్షక వాగ్దానాలు చేయడానికి బడ్జెట్ను ముందుగా ప్రవేశపెట్టడం ఒక అవకాశాన్ని ఇస్తుందని పిటిషనర్ వాదించారు.
కేంద్ర బడ్జెట్ వ్యక్తిగత రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదని, ఇది యావత్తు దేశానికి సంబంధించిన విషయమని పేర్కొంటూ సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. పైగా కేంద్ర బడ్జెట్కు రాష్ట్రాలతో ఎలాంటి సంబంధం లేదు. పైగా రాష్ట్ర ఎన్నికల కారణంగా కేంద్రం పనితీరుకు ఆటంకం కలిగించదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. అలా అప్పటి నుంచి ఫిబ్రవరి 1నే ఆర్థికమంత్రి కేంద్ర బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం ఆనావాయితీగా మారింది.


