నిరాశల బడ్జెట్..!
‘పోలవరం’ నిర్వాసితుల ఊసేదీ..?
కేంద్రం బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యి చూపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులతో అప్పులు ఇస్తారా..? విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించి బడా కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగిం చేసే మోడీ బడ్జెట్ ఇది. కోస్టల్ కారిడార్, విశాఖ స్టీల్కు సొంత గనుల కేటాయింపు, కోటిపల్లి రైల్వే లైన్కు నిధులు శూన్యం. 2025–26 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లుగా ప్రకటించి.. సవరించిన అంచనాలలో అదే రూ.49,64,842 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ రూ.53,47,315 కోట్లు అంటూ ఘనంగా ప్రకటించారు. ఇది పేద ప్రజలను కాగితాల్లో మోసగించడమే. ఉభయ రాష్ట్రాలకు అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి ఈ బడ్జెట్లో నిధులు తక్కువగా కేటాయించి తీవ్ర అన్యాయం చేశారు. జాతీయ ప్రాజెక్టుకు త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించలేదు. ఎప్పటి నుంచో రైలు వస్తుందని కలలు కంటున్న కోనసీమ వాసులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోటిపల్లి రైల్వే లైనుకు ఒక రూపాయి కూడా విదల్చలేదు.
– తాటిపాక మధు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
వ్యవసాయ, పారిశ్రామిక
రంగాలకు నిరాశే
వికసిత భారత్–2047 లక్ష్యంగా సాగిన కేంద్ర బడ్జెట్ భారతీయ ఖాదీ, టెక్స్ టైల్, ఫిషరీస్, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలతో పాటు క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, న్యూక్లియర్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు మార్గాన్ని వేస్తున్నామని ప్రకటించారు. ప్రతి బడ్జెట్లో లాగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల కేటాయింపులు, ప్రోత్సాహకాలు, వాటాలు ఈ బడ్జెట్లో అంతగా కనిపించలేదు. క్యాన్సర్కు సంబంధించి 17 రకాల ఔషధాలపై, 7 రకాల వ్యాధులకు సంబంధించి వాటి మందులకు పన్ను మినహాయింపులు ఊరట కలిగించే విషయం. వివిధ రకాల జంతువుల పరిరక్షణకు బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ మదుపర్లు, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వర్గాల ప్రస్తావన లేకుండా బడ్జెట్ ఉండడం కొన్ని వర్గాల్లో అసంతృప్తి కలిగించింది.
– డాక్టర్. ఎంవీ కాళేశ్వరరావు,
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు
నిరాశల బడ్జెట్..!


