నారసింహాయ.. దుష్టసంహారాయ
● అంతర్వేదిలో
అట్టహాసంగా కల్యాణోత్సవాలు
● రెండో రోజు హంస, శేష వాహనాలపై సేవ
● స్వామివారికి విశేష పూజలు
సఖినేటిపల్లి: నారసింహాయ.. నమో భగవతాయ అంటూ ఆ లక్ష్మీనృసింహుడిని భక్తజనం కొలిచింది.. అంతర్వేదిలో స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం భక్తులతో క్షేత్రం కిక్కిరిసింది.. ఆ స్వామిని చూసిన ప్రతి మది మురిసింది.. స్వామివారికి సాయంత్రం 4 గంటలకు హంస వాహనంపై, రాత్రి 8 గంటలకు శేష వాహనంపై గ్రామోత్సవాలను అట్టహాసంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చక స్వాములు సాయంత్రం 6.30 గంటల నుంచి విశేష పూజలు చేశారు. తొలుత స్వామివారి సన్నిధిలో వైఖానస ఆగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తు హోమం, గరుత్మంతుని హోమం, అంకురార్పణ, ధూపసేవ, ధ్వజారోహణ, గరుత్మంతుని చిత్రపటం ఆవిష్కరణ వంటి విశేష కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. సోమవారం నుంచి పౌర్ణమి వరకూ ఉత్సవాల నిర్వహణకు అర్చకులు ఏడు రోజుల పాటు విష్ణు దీక్ష తీసుకున్నారు. ఏటా ఈ దీక్ష చేపట్టడం వారికి ఆనవాయితీగా వస్తోంది. అర్చకులకు దీక్షా వస్త్రాలను జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహుద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబురాజు అందజేశారు. స్వామివారి దీక్ష తీసుకున్న అర్చకులు భక్తిశ్రద్ధలతో అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించారు. నవ ధాన్యాలను పుట్ట మట్టిపై చల్లి, సర్వ దేవతలను ఆవాహనం చేసి, ఏడు రోజుల పాటు అర్చనలకు శ్రీకారం చుట్టారు. ఈ నవధాన్యాల నుంచి మొక్కలు ఎంత ఏపుగా ఎదిగితే అంతమేర గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉంటాయని పురాణ ప్రతీక.
ధ్వజారోహణ విశిష్టత ఇది
స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేయడమే ధ్వజారోహణ అని ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్ తెలిపారు. కల్యాణ మహోత్సవాలకు దుష్టశక్తుల వల్ల ఎటువంటి అవరోధాలు లేకుండా ఉండేందుకు కూడా ధ్వజారోహణ చేస్తామని వివరించారు. ధ్వజస్తంభానికి మామిడి ఆకులు, దర్భలను కట్టి, గరుత్మంతుని చిత్రం గీసిన వస్త్రాన్ని అర్చకులు ఎగురవేశారు.
అంతర్వేదిలో నారసింహునికి హంస వాహనంపై గ్రామోత్సవం
గరుత్మంతుడికి పూజలు చేస్తున్న అర్చకులు
కల్యాణోత్సవాల్లో నేడు
అంతర్వేదిలో కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకు హనుమద్వాహనం, రాత్రి 8 గంటలకు సింహ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాలు ఉంటాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5.30 గంటల నుంచి 7 గంటల వరకూ స్వామివారి తిరువారాధన, ఆర్జీత అభిషేకం, బాలభోగం, సాధారణ, ప్రత్యేక దర్శనాలు జరుగుతాయి. వీటితో పాటు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ నారసింహ సుదర్శన హోమం నిర్వహిస్తారు.
నారసింహాయ.. దుష్టసంహారాయ
నారసింహాయ.. దుష్టసంహారాయ


