తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొన్న భాష్యం
సిల్వర్ జూబ్లీలో వక్తలు
రాజమహేంద్రవరం రూరల్: విద్యా సంస్థలను స్థాపించి 25 సంవత్సరాలు విజయవంతంగా నడిపించడం, ఇంతమంది తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనడం గొప్ప విషయమని జీఎస్ఎల్ హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెంటర్, సర్జన్ డాక్టర్ గన్ని భాస్కరరావు అన్నారు. మంగళవారం వి.ఎల్.పురంలోని మార్గాని ఎస్టేట్స్లో భాష్యం 25 విద్యా వసంతాలు పేరిట జరిగిన రజతోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాస్కరరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ భాష్యం తన శాఖలను విస్తరించుకోవడం అభినందనీయమన్నారు. భాష్యం పూర్వ విద్యార్థి, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బాబీ మాట్లాడుతూ భాష్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భాష్యం విద్యాసంస్థలను ముందుకు నడిపించడంలో మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ విజయవంతుడు అవుతాడు అనడంలో సందేహం లేదన్నారు. భాష్యం పూర్వ విద్యార్థి, ప్రముఖ వైద్యురాలు ప్లాస్టిక్ రీ కనస్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ సీహెచ్.దుర్గ సౌగంధి మాట్లాడుతూ 25 సంవత్సరాలు ఒక సంస్థను నడపడం సవాల్తో కూడిందన్నారు. చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో రజతోత్సవం మర్చిపోలేని జ్ఞాపకం అన్నారు. వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించేందుకు భాష్యం విద్యాసంస్థలు నడుం బిగించాయన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉన్నతమైన విద్యను అందించేందుకు భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్స్ను స్థాపించామన్నారు. భాష్యం విద్యాసంస్థల ముఖ్య సలహాదారు మైఖేల్ రాజ్, ఉభయగోదావరి జిల్లాల జెడ్ ఈ ఓ లు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


