మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
● గుర్తించిన ఘాట్లలో మాత్రమే
పుణ్యస్నానాలకు అనుమతి
● కలెక్టర్ కీర్తి
● ఎస్పీ డి నరసింహ కిశోర్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 15న జరిగే మహా శివరాత్రి సందర్భంగా భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులకు సూచించారు. గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మహా శివరాత్రి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్ అధ్యక్షతన సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన ప్రధాన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వాలన్నారు. అనధికార ఘాట్ల వద్ద భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. గతంలో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని మునిసిపల్, మండల అధికారులు టామ్టామ్, మైక్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లో ఇప్పటి నుంచే విస్త్రత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. ఘాట్ల నిర్వహణ బాధ్యతలను శాఖల వారీగా స్పష్టంగా కేటాయించారు.
మునిసిపల్ శాఖ పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ శాఖ ఘాట్ల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ, బారికేడింగ్, చెక్పోస్టుల ఏర్పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా అన్ని ఘాట్లు, దేవాలయాలు, రహదారుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర మానిటరింగ్ చేపడతామని, గ్రామ స్థాయిలో విలేజ్ మానిటరింగ్ టీమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ జామ్లు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, నో పార్కింగ్ జోన్లు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీవో కె. భాస్కర్రెడ్డి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత , డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


