పోలీస్ పీజీఆర్ఎస్కు 19 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 19 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా పోలీసు అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ పీజీఆర్ఎస్కు కుటుంబ సమస్యలు, ఛీటింగ్, కొట్లాట, సివిల్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
ఆర్థిక అవగాహన పెంపొందించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజల్లో ఆర్థిక అవగాహనను పెంపొందించాలని కలెక్టర్ కీర్తి అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 13 వరకూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐ రూపొందించిన పోస్టర్లను ఎస్పీ నరసింహ కిశోర్, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలలో జాగ్రత్తలు, పొదుపు అలవాటుతో పాటు ఆర్థిక మోసాలపై అవగాహన చాలా అవసరమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సమస్యలు పరిష్కరించకుంటే
న్యాయ పోరాటం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా న్యాయపరమైన చర్యలతో పాటు, ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రైవేట్ గుర్తింపు పొందిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్య సంఘం అల్టిమేటం జారీ చేసింది. సోమవారం కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్ ఆవరణలో రాష్ట్ర ప్రైవేట్ గుర్తింపు పొందిన ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్య సంఘం (ప్రాస్మ) రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రాస్మ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోలమూరు ప్రభాకరరావు, కె.రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకటి నుంచి పదిమంది విద్యార్థులున్న మండలపరిషత్,మున్సిపల్ పాఠశాలలు నడుస్తుండగా, ఎయిడెడ్ పాఠశాలలకు 40మంది విద్యార్థులు తప్పనిసరి అని షరతు విధించడం సరికాదన్నారు. త్రిసభ్య కమిటీ తనిఖీల పేరుతో గైర్హాజరు విద్యార్థులను పాఠశాలల నుంచి తొలగించాలనే ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు కరస్పాండెంట్ షిప్ రద్దు చేస్తామని షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు 19 ఫిర్యాదులు


