పుష్కర యాత్రికులకు ప్రత్యేక రూట్ మ్యాప్
రాజమహేంద్రవరం సిటీ: 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పుష్కరాల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే వాహనాలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాలు తదితర వాటిపై బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆమె క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించాలని, తిరిగి అదే మార్గంలో చేరవేసేలా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాటికి వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం కాటన్ పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. అలాగే వేమగిరి సెంటర్, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి, ఆర్టీసీ కాంప్లెక్స్, తూర్పు రైల్వే స్టేషన్ మార్గం, లాలాచెరువు, కాతేరు మీదుగా కోటిలింగాల రేవు వరకు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, స్థానికుల వాహనాలకు ప్రత్యేక అనుమతుల జారీ వంటి అంశాలపై సమీక్షించారు.
ఫ ఈ నెల 15న మహా శివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ముఖ్యంగా అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేయాలన్నారు. పుష్కరాలు, శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాలు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని, వాహనాల రాకపోకలను దశల వారీగా మళ్లించే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. వారి వెంట ఎస్డీసీ ఇన్చార్జి ఆర్డీవో కె.భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు, రూరల్ తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, సీఐ కాశీవిశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ కీర్తి చేకూరి
ఫ ట్రాఫిక్ మళ్లింపు,
పార్కింగ్కు క్షేత్రస్థాయి పరిశీలన
ఫ మహాశివరాత్రి వసతులపై దిశానిర్దేశం
ఫ పాల్గొన్న ఎస్పీ నరసింహ కిశోర్,
కమిషనర్ రాహుల్ మీనా


