తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు కూలైన్లలో బారులు తీరారు. మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి: గోదావరి తీరంలో భక్తులతో ఘాట్లు కళకళలాడుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామకు కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. మురమళ్ళలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో ద్రాక్షారామ,కోటిపల్లి శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శివనామ స్మరణతో ద్రాక్షారామ శ్రీభీమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర వారి ఆలయాలు మార్మోగుతున్నాయి. కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే కోటిపల్లి గౌతమి గోదావరి నిధులు పుణ్యా స్నానాలు ఆచరించిన భక్తులు.. సోమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
నంద్యాల జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జాముముండి 4 గంటల నుండే సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి. దర్శనానికి నాలుగు క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఆది దంపతులకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోలాహలం నెలకొంది. ఓం నమశ్శివాయ మంత్రాక్షరితో దక్షిణకాశీ వేములవాడ పులకిస్తోంది. కోడె మొక్కులకు కొలువైన క్షేత్రంగా వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం టీటీడీ పట్టువస్త్రాల సమర్పించింది. ఇవాళ ఉదయం 8 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పించనున్నారు. సాయంత్రం లింగార్చన జరుగనుంది. రాత్రి ప్రారంభమయ్యే లిగోద్భవ పూజకు భక్తులు తరలిరానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ పాల్గొనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం శైవక్షేత్రం మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. విద్యుత్ కాంతులతో కాళేశ్వరం క్షేత్రం ముస్తాబైంది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరం తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు .వైభవంగా శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగంలో హంస వాహన సేవ తెప్పోత్సవ కార్యక్రమం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా: ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కొమురవెల్లి మల్లన్న, అయినవోలు మల్లన్న ఆలయాలతో సహా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆగమానుసారంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ మంగళవాయిద్య సేవ ఉత్తిష్ఠగణపతికి హరిద్ర కుంకుమ లేపణ అభిషేకం, రుద్రేశ్వరస్వామికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లను నంది వాహనంపై మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో ఎదురుకోలు నిర్వర్తించి రుద్రేశ్వరునికి ఎదురుగా సూర్యాలయంలో ఆది దంపతులను ప్రతిష్టించి గణపతి నవగ్రహ అష్టదిత్పాలక పూజలు నిర్వహించారు.


