వక్ఫ్భూముల ప్రైవేటీకరణ ఆపాలి
ఏఓ అలీకి వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ విభాగం వినతి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గుంటూరుకి చెందిన 72 ఎకరాల 57 సెంట్ల అంజుమన్ ఏ ఇస్లామీయ సంస్థకు చెందిన భూములను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు యండి హమీద్ బాషా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రాలను అందించే కార్యక్రమం సోమవారం చేపట్టడంతో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ఏఓ అలీకి వినతి పత్రం అందచేశారు. హామీద్ బాషా మాట్లాడుతూ తరతరాలుగా అంజుమన్ ఏ ఇస్లామీయా సంస్ధకు చెందిన భూములు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు. నేడు చంద్రబాబు ఈ ఆస్తులను ప్రైవేట్కి అప్పజెప్పడం కోసం స్థానిక కలెక్టర్తో నోటీసులు పంపించారన్నారు. 90 రోజుల గడువుతో ఈ నోటీసులు అందించారన్నారు. ఎన్నో తరాలుగా ఈ భూములను కాపాడుకుంటూ వస్తున్నామని, కాని చంద్రబాబు ఈ భూములను కారు చౌకగా ప్రైవేటీ సంస్థలకు అప్పజెబుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసీనా, రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ, రాష్ట్ర మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ నిజామ్, వక్ఫ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్, రాష్ట్ర కార్యదర్శి అమనుల్లా బేగ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కరీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం బాషా, రాజమహేంద్రవరం రూరల్ మైనార్టీ సెల్ ఇన్చార్జి చానా, రాజమహేంద్రవరం నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అరిఫుల్లఖాన్, నిడదవోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ ఇన్చార్జి చాంద్ బాషా, రాజానగరం మైనారిటీ సెల్ ఇన్చార్జి కాలా బాషా, గోపాలపురం ఇన్చార్జి యూసఫ్ ముస్తఫా, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షకీలా బేగం, సమీరా బేగం పాల్గొన్నారు.


