ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ జరగాలి
రాజమహేంద్రవరం రూరల్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ జరగాలని ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీడీ నడాఫ్ అన్నారు. మోరంపూడిలోని కల్యాణ మండపంలో బుధవారం ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఐదో సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎస్ రామచంద్రరావు, పీఎస్వీఎస్ శర్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, జనరల్ సెక్రటరీ నడాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడాఫ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినట్లే పెన్షనర్లకు కూడా రివిజన్ జరగాలని డిమాండ్ చేశారు. రివిజన్ పెరగకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం కోర్టులో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రాధాకృష్ణ, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్, ఆలిండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్.చంద్రశేఖర్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.కాశీ విశ్వనాథ్, ఎస్బీఐ సేవ జనరల్ సెక్రటరీ ఎం.సునీల్ తదితరులు పాల్గొన్నారు.


