బాలయోగీశ్వరులను దర్శించుకుందాం రారండి
నేటి నుంచి తీర్థమహోత్సవాలు
ముమ్మిడివరం: ముని మండలంగా ప్రసిద్ధి చెందిన ముమ్మిడివరంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. నాలుగు దశాబ్దాల పాటు కఠోర తపస్సు ఆచరించి ముక్తి పొందిన శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో ఆదివారం నుంచి తీర్థ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం బాలయోగీశ్వరుల దివ్య సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులు అన్నసమారాధన, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ దర్శన మండపంపై బాలయోగీశ్వరుల పరబ్రహ్మ మూర్తి విగ్రహ దర్శనం, దివ్య సమాధుల దర్శనం ఉంటుంది.
కఠోర తపస్సు చేసి..
ముమ్మిడివరంలో కటికదల గంగయ్య, రామమ్మ దంపతులకు సుబ్బారావు 1930 అక్టోబర్ 23న జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పశువుల కాపరిగా జీవనం సాగిస్తూ భక్తిభావం అలవర్చుకున్నారు. స్థానిక లంకతల్లమ్మ తీర్థంలో కృష్ణుడు, నారదుడు ఫొటోలను కొని తెచ్చుకుని కొబ్బరి తోటలో చెట్టు కింద పెట్టి గంటల తరబడి జ్ఞానంలో నిమగ్నమయ్యారు. 1946 జూన్ 22న కృష్ణ నామస్మరణతో తపస్సును ప్రారంభించారు. ఎండ, వాన లెక్క చేయకుండా నిద్రాహారాలు మాని ధ్యానంలో గడిపారు. అదేవిధంగా అతని సోదరుడు కూడా తపస్సులో పాల్గొన్నారు. బాల్య దశలోనే జ్ఞాన నిరతిని కలిగిన ఈ సోదరులు బాలయోగీశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. సుమారు 40 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి ఈ ప్రాంతానికి చారిత్రాత్మక పేరు తెచ్చారు. తపో ఆశ్రమంలో నిరంతరం తపస్సు ఆచరిస్తూ ఏటా శివరాత్రి మరునాడు భక్తులకు ప్రత్యక్ష దర్శనమిచ్చేవారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చేవారు. తీర్థం అనంతరం భగవాన్ బాలయోగీశ్వరుల తపస్సుకు భంగం వాటిల్లకుండా తపో మందిరం తలుపులకు తాళాలు వేసేవారు. 1985 జూలై 19న పెద బాలయోగీ, 1991 అక్టోబర్ 28న చిన బాలయోగీశ్వరులు కై వల్య సిద్ధి పొందారు. ఽసోమవారం జరిగే తీర్థ మహోత్సవాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు బాలయోగీశ్వరుల సమాధులను దర్శించుకోనున్నారు. ఇప్పటికే తపో ఆశ్రమాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
బాలయోగీశ్వరులను దర్శించుకుందాం రారండి
బాలయోగీశ్వరులను దర్శించుకుందాం రారండి


