యథేచ్ఛగా రాజకీయ ‘ఎత్తిపోతలు’!
తాళ్లపూడి: వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకాన్ని అధికార టీడీపీ నాయకుల రాజకీయాలకు వేదికగా మార్చేశారు. పథకం అధ్యక్షుడి విషయంలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు మరింత ముదరడంతో రైతులు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వర్గం, ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన కై గాల రాంబాబు వర్గం మధ్య నెల కొన్న విభేదాలు రోడ్డున పడ్డాయి. మధ్యలో అధికారులను పావులుగా వాడుకుంటున్నారు.
మాజీ అధ్యక్షుడు రానందునే
తాళాలు పగులగొట్టాం : ప్రత్యేకాధికారి
మండలంలోని వేగేశ్వరపురం ఎత్తిపోతల పథథకం నిర్వహణ కమిటీ రద్దయిందని, ఇక నుంచి అధ్యక్షుడు కై గాల రాంబాబు బదులు తమ శాఖ సిబ్బందే నిర్వహణ సాగిస్తారని పీఎస్ఐడీసీ ఈఈ దుర్గ గురవయ్య తెలిపారు. 41 జీవో ప్రకారం ఈ నెల 3న ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టానని, రికార్డుల కోసం మాజీ అధ్యక్షుడు రాంబాబుకు నోటీసు జారీ చేసినా ఆయన హాజరు కానందున తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీలావణ్య, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ, ఏపీఎస్ఐడీసీ ఏఈ సురేంద్ర, సమక్షంలో కార్యాలయ తాళాలను పగులగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు ఈఈ గురవయ్య తెలిపారు. కొత్త కమిటీ ఏర్పడే వరకు తన అధీనంలోనే నిర్వహణ సాగుతుందని తెలిపారు. ఆయనతో పాటు బల్లిపాడుకు చెందిన టీడీపీ నాయకులు కాకర్ల శ్రీను, ఉప్పులూరి రమేష్, మద్దుకూరి శంకరం పలువురు రైతులు ఉన్నారు.
నాకు కనీస గౌరవం ఇవ్వలేదు
28 సంవత్సరాలకు పైగా సేవలందించిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా టీడీపీ వర్గీయులు ప్రతిపక్షం కంటే హీనంగా వ్యవహరించారని మాజీ అధ్యక్షుడు కై గాల రాంబాబు పేర్కొన్నారు. నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు 41 జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును వాపస్ తీసుకున్నానని చెప్పారు. రికార్డులను అప్పగించేందుకు సోమవారం వస్తానని చెప్పినా తాళాలు పగులు కొట్టడం ఎందుకన్నారు. రికార్డులు స్వాధీనం చేసుకోవటం చూస్తే, తాను అధికార పార్టీ మనిషినా, లేక ప్రతిపక్షంలో ఉన్నానా తెలియటం లేదని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి వైద్య సేవలకు వెళ్లి వచ్చేంత వరకు కూడా మరో వర్గం నాయకులు ఆగలేదని అన్నారు. కాగా అధికార పార్టీ నాయకుల వర్గ పోరుతో పథకం నిర్వహణ ఎలా సాగుతుందో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


