సుప్రీం కొలీజియం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలకమైన విధానపర నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు అప్పగించే జడ్జీలను ఆ పోస్ట్ ఖాళీ అయ్యేందుకు కనీసం రెండు నెలలు ముందుగానే ఆయా కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ హైకోర్టు కార్యకలాపాలపై ఆ జడ్జికి మంచి అవగాహన వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో గురువారం సమావేశమైన కొలీజియం అభిప్రాయపడింది.
కోర్టు నిర్వహణలో సమర్థంగా, మెరుగ్గా వ్యవహరించగలుగుతారని కొలీజియం సమావేశం పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేయాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైరైన వెంటనే ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియామకం అమల్లోకి వస్తుందని వివరించింది. అదేవిధంగా, కేరళ హైకోరు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 5న రిటైరవనున్నారు.


