53వ సీజేఐగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు
కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఏడు దేశాల చీఫ్ జస్టిస్లు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీ భాషలో భగవంతుడి పేరిట ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన అక్కడే ఉన్న తన సోదరితోపాటు సోదరుడి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ని ఆతీ్మయంగా ఆలింగనం చేసుకున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్తోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి భూ టాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక, బ్రెజిల్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం విశేషం.

ప్రధాని మోదీ అభినందనలు
జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్, మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ కలిసి ఫొటో దిగారు.
కొలీజియం చీఫ్గా జస్టిస్ సూర్యకాంత్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇకపై సుప్రీంకోర్టు కొలీజియం అధినేతగానూ వ్యవహరించబోతున్నారు. ఇన్నాళ్లూ ఈ పదవిలో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయ్యింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ సహా మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్ సభ్యులు.
సీజేఐల గురించి ఐదు విశేషాలు!
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 52 మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశ న్యాయవ్యవస్థ కాపు కాసినవారే. అయితే మనలో చాలామందికి గత సీజేఐల విశేషాలు తెలిసింది తక్కువే. మహిళ న్యాయమూర్తి ఇప్పటివరకూ ఈ అత్యున్నత పదవిని చేపట్టకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది 62 ఏళ్లు మాత్రమే. సుప్రీంకోర్టు సీజేఐకి మాస్టర్ ఆఫ్ ద రోస్టర్గా పేరు. ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపడతారన్న విషయంపై సీజేఐదే తుది నిర్ణయం. అధికారిక హోదాల ప్రకారం... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతుల తరువాతి స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.
1. జస్టిస్ హరిలాల్ జెకిసన్దాస్ కానియా
దేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటు తరువాత నియమితులయ్యారు.
2. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్
తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. 2007-2010 మధ్యకాలంలో పనిచేశారు.
3. జస్టిస్ బి.ఆర్.గవాయి
52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన తొలి సీజేఐ. ఈ అత్యున్నత పదవిని అధిష్టించిన రెండో దళితుడు కూడా.
4.జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్
1978 - 19875 మధ్య దేశ అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడేళ్లకాలం ఈ పదవిలో ఉన్న తొలి జస్టిస్.
5. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్
1991లో కేవలం పదిహేడు రోజులు మాత్రమే సీజేఐగా పనిచేశారు. అతితక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా ఇదో రికార్డు.



