ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. శ్రీనగర్లో వీరిని అరెస్ట్ చేశారు. దీనితో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
నిందితులను పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, అనంతనాగ్కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, షోపియన్కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించినట్లు NIA తన ప్రకటన పేర్కొంది. జిల్లా సెషన్స్ జడ్జి, పాటియాలా హౌస్ కోర్టు నుండి ప్రొడక్ట్ ఆర్డర్ల మేరకు నలుగురునిందితులను NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనేక మంది అమాయకులను బలిగొనడంతోపాటు, అనేక మందిని గాయపరిచిన ఉగ్రవాద దాడిలో వీరంతా కీలక పాత్ర పోషించారని ఈ ప్రకటన తెలిపింది.
కాగా ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనపై భద్రతా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.


