న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో నవంబరు 10న జరిగిన పేలుళ్ల కేసులో దర్యాప్తు అధికారులు పాక్ ప్రేరేపిత ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను గుర్తించారు. పాకిస్థాన్ నుంచి ఈ పేలుడు మాస్టర్మైండ్లు కోడ్ భాషల్లో ఉగ్రవాద వైద్యులకు సందేశాలు పంపినట్లు తేల్చారు. ఘోస్ట్ సిమ్ వినియోగించిన ఉగ్రవాదులకు.. వాట్సాప్, టెలిగ్రామ్లో ఈ మేరకు కోడ్ సందేశాలను పంపినట్లు నిర్ధారించారు.
నిందితులు డాక్టర్ ముజమ్మీల్ గనాయ్, ఆదిల్ రాథర్, ఇతర నిందితులు ఈ సందేశాలను అందిపుచ్చుకునేందుకు డ్యూయల్ ఫోన్ ప్రొటోకాల్ పద్ధతిని అనుసరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితులు రెండుమూడు మొబైల్ హ్యాండ్సెట్లను వాడారని, ఒకదాన్ని రోజువారీ పనులకోసం ఉపయోగిస్తే.. మిగతా వాటిని వాట్సాప్ కోసం ప్రత్యేకంగా ఒకటి, టెలిగ్రామ్ కోసం మరోటి వినియోగించినట్లు తేల్చారు. ఈ తరహా ఫోన్లను దర్యాప్తు అధికారులు ‘టెర్రర్ ఫోన్’లుగా అభివర్ణిస్తున్నారు.
ఏమిటా కోడ్స్?
ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు పాకిస్థాన్ నుంచి వచ్చిన కోడ్లను గుర్తించారు. వాటిల్లో ‘ఉకాసా’, ‘ఫైజాన్’, ‘హాష్మీ’ అనే కోడ్లు ఎక్కువగా ఉన్నట్లు నిగ్గుతేలింది. ఆ కోడ్లను డీకోడ్ చేస్తున్నారు. మరోవైపు నిందితులు ఘోస్ట్ సిమ్ కార్డులను ఎలా పొందగలిగారనేదానిపై జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన ఓ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఉగ్ర డాక్టర్లకు పాకిస్థాన్ లేదా పీవోకేకు చెందిన మాడ్యూల్స్ ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు అనుమానిస్తున్నారు.


