ఢాకా: బంగ్లాదేశ్లో తీవ్రస్థాయిలో నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా షాపింగ్ మాల్స్, మార్కెట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 12న వెలువడిన ఈ అధికారిక ఆదేశాల ప్రకారం, దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. విద్యుత్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దీనితో పాటు రాత్రి 7 గంటల తర్వాత ఎటువంటి విద్యుత్ దీపాలతో కూడిన హోర్డింగ్లను వెలిగించకూడదని, అలాగే అలంకరణ లైట్లను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు అమలవుతున్న నేపథ్యంలో, ఈ నిబంధనలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాలు ఢాకాకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని నగరపాలక సంస్థల మేయర్లకు, డివిజనల్ కమిషనర్లకు సూచనలు జారీ అయ్యాయి. అంతేకాకుండా, కొనసాగుతున్న ప్రదర్శనలు, వ్యాపార వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం రాత్రి 8 గంటలకే ముగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్, గ్యాస్ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ మంత్రి ఇక్బాల్ హసన్ మహమూద్, భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మతో సమావేశమై భారత్ నుంచి అదనపు డీజిల్ సరఫరా చేయాలని కోరారు. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన దిగుమతులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున, భారత్ నుంచి ఇంధన సరఫరాను బంగ్లాదేశ్ ఆశిస్తోంది. బంగ్లాదేశ్ అభ్యర్థనను పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: రైల్వేశాఖ నిధులతో తీసిన ఏకైక సీరియల్ చూశారా?


