న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని టక్సింగ్ సెక్టార్లో చైనా సైన్యం క్రమంగా పట్టు పెంచుకుంటోందన్న ఆరోపణలు మరోసారి చర్చకు దారితీశాయి. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని LAC వెంబడి భారత బలగాలు సంప్రదాయంగా పెట్రోలింగ్ చేసే ప్రాంతాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అడ్డంకులు సృష్టిస్తోందని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (PPA) ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీ ఆరోపించింది.
2023లో ఘర్షణ అనంతరం షెరా-5 పెట్రోలింగ్ పాయింట్కు భారత బలగాలు తిరిగి వెళ్లలేదని, అక్కడి భారత గుర్తులను PLA తొలగించిందని కమిటీ పేర్కొంది. టక్సింగ్లోని నంగా పహార్ ప్రాంతంలో స్థానికుల వేట, యాక్ల మేతకు ఆంక్షలు ఉన్నాయని తెలిపింది. శీతాకాలంలో భారత పెట్రోలింగ్ పరిమితమవుతున్న నేపథ్యంలో సరిహద్దులో ‘సీజనల్ వాక్యూమ్’ ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, హెలిప్యాడ్లు, సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాలని PPA కోరింది. ముఖ్యంగా నాచో-టక్సింగ్ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించింది.
అయితే PPA ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. భారత సైన్యం, ITBP సరిహద్దును సమర్థంగా పర్యవేక్షిస్తున్నాయని, చైనా కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపాయి. చైనా కూడా భారత్-చైనా సరిహద్దు పరిస్థితి ప్రస్తుతం “సాధారణంగా స్థిరంగా ఉంది” అని పేర్కొంది. టక్సింగ్లో చైనా కొత్తగా భారత భూభాగాన్ని ఆక్రమించిందనే అధికారిక నిర్ధారణ ప్రస్తుతం లేదు. అయితే 2023 నుంచి పెట్రోలింగ్కు ఎదురవుతున్న అడ్డంకులపై PPA లేవనెత్తిన ప్రశ్నలు సరిహద్దు భద్రతపై మరోసారి చర్చకు తెరతీశాయి.


