అతడు చదువుకున్న మేథావి. ఆంగ్ల సాహిత్య పిపాసి. కానీ అతని మనసు భూమాతకే అంకితం అన్నది. పుస్తకాలు మేథస్సును తీర్చిదిద్దినా..హృదయాన్ని గెలుచుకుంది మాత్రం వ్యవసాయమే. అందుకే ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసినా వ్యవసాయం వైపుకే మళ్లీ రైతుగా మారి..ఎన్ని పంటలు పండించాడో వింటే విస్తుపోతారు. వేసిన ప్రతిపంట లాభాలే తెచ్చిపెట్టింది. నేలమ్మకు మించిన బంగారం ఏముంది అని నిరూపించాడు.
అతడే అరుణాచల్ప్రదేశ్కు చెందిన కళింగ్ సిరామ్ . అతడు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే అందరిలా వైట్ కాలర్ జాబ్లు కాకుండా వ్యవసాయం వైపుకి మళ్లాడు. తన నిజమైన అభిరుచి వ్యవసాయమే అంటూ రైతుగా మారాడు. అందుకు తన తల్లే స్ఫూర్తి అని చెబుతాడు. అరుణాచల్ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని సిల్లే అనే సుందరమైన గ్రామంలో వైవిధ్యభరితమైన పంటలు పండించి మంచి రైతుగా పేరుతెచ్చుకున్నాడాయన.
అమ్మనాన్నల కారణంగానే ఇలా..!
తన బాల్యంలో స్వగ్రామమైన దేబింగ్లో అరవై ఏళ్ల వయసులో ఉన్న తన తల్లి పెద్ద ఎత్తున రబ్బరు, నారింజ, పసుపు, అల్లం పండించడాన్ని చూశానని చెప్పాడు. అదే సమయంలో చనిపోయిన తన తండ్రి, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, అయినప్పటికీ వ్యవసాయంతోనే ఎక్కువ గడిపేవాడని చెప్పుకొచ్చాడు. అలా తనకు వ్యవసాయంపై ఆసక్తి కలిగిందని అంటాడు సిరమ్.
అందువల్లే మాస్టర్ డిగ్రీ పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదని అంటాడు. తాను కాంట్రాక్టర్గా పనిచేసి ఆదా చేసిన సొమ్ముతో 2017లో సిల్లేలో దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అక్కడే ఫామ్ హౌస్ నిర్మించుకుని పాడి వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. పాల అమ్మకం ద్వారా నెలకు 15 వేల నుంచి 20 వేలు వరకు లాభం పొందాడు. ఆ తర్వాత చేపల చెరువుల, కోళ్లు, మేకల పెంపకంతో ప్రయోగాలు చేశాడు. వాటిల్లోనూ లక్షల్లో లాభాలు ఆర్జించాడు.
ఆ తర్వాత వరి తోపాటు, ఆవాలు, నువ్వులను పండించాడు. అలాగే అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, మాంగోస్టీన్, లాంగన, మాకాడమియా వంటి అరుదైన పంటలను కూడా పండించినట్లు వెల్లడించాడు. ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ లాభదాయకమైన పంట అవుతుందని..వీటితో టోకు ధరల ప్రకారం సుమారు రూ. 12 లక్షల వరకు ఆదాయం రావొచ్చని అంటున్నాడు. ఇక తన తదుపరి ఆశయం, తేయాకు, పామాయిల్ సాగులోకి ప్రవేశించడమేనని చెబుతున్నాడు.
ఆయన పంటలన్నింటి శాస్త్రియ పద్ధతుల్లోనే పండించి లాభలు గడించడం విశేషం. అంతేగాదు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏడాది పొడవునా సుమారు పది మంది కార్మికులు పనిచేస్తుంటారు. వాళ్లకు నెలకు సుమారు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతాలు ఇస్తానని అన్నాడు.
ఉద్యోగం కన్నా వ్యవసాయమే బెటర్..
చివరగా ఆయన యువతను వ్యవసాయం వైపు మళ్లండి, సొంత భూమి ఉన్నప్పటికీ..ప్రభుత్వం ఉద్యోగాల వైపుకి వెళ్తున్నారు, కానీ అవి పరిమితంగానే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వ్యవసాయం చేపడితే నువ్వే స్వయంగా యజమనిగా ఉంటావు, పైగా నీపై ఎవరి ఒత్తిడి ఉండదని పిలుపునిస్తున్నాడు సిరామ్.
రైతుగా పనిచేస్తున్నా.. తన సాహిత్య అభిలాషను మాత్రం వదలుకోడు సిరామ్. ఏ కాస్త సమయం దొరికిన షేక్స్పియర్, మిల్టన్, చార్లెస్ డికెన్స్ రచయితల పుస్తకాలు చదివేస్తుంటాడట. నిజంగా గ్రేట్ కదా..! ఇతడి కథ మహర్షి మూవీలోని మహేశ్ బాబు స్టోరీలా ఉంది కదూ..!.
(చదవండి: ఆ మెటర్నిటీ డ్రెస్ అంత ధర పలకదు..!: ఇచ్చిపడేసిన ఉషా వాన్స్)


