సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేయదలచిన మధ్యంతర పిటిషన్లను ఆగస్టు 25వ తేదీ లోపునే దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్ విజయం సాధించినట్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఆర్.డి శేఖర్, అలాగే ఓటర్లు దినేష్, లక్ష్మీ నరసింహన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఇదే తరహాలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే హైకోర్టు ముఖ్యమంత్రి విజయ్ను ఆదేశించింది. పిటిషన్లు జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఎదుట విచారణకు వచ్చాయి. సీఎం విజయ్ తరఫు న్యాయవాదులు జి.మాసిలామణి, శ్రీనాథ్ శ్రీదేవన్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సీఎం విజయ్కు వ్యతిరేకంగా దాఖలైన ఈ ఎన్నికల పిటిషన్లను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతూ తాము ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని, ఇందుకోసం 4 వారాల సమయం కావాలని అభ్యరి్థంచారు.
నాలుగు వారాల గడువు ఇచ్చేందుకు నిరాకరించిన జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఆగస్టు 25 లోపు పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేశారు. తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సాధించిన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ విచారణను కూడా న్యాయమూర్తి ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


