హరిద్వార్: కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత హరిద్వార్లో భారీ వ్యర్థాల సమస్య తలెత్తింది. ఈ ఏడాది సుమారు 4.8 కోట్ల మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్ను సందర్శించి, గంగాజలాన్ని సేకరించారు. యాత్ర ముగిసిన అనంతరం, గంగా తీరాలు, మేళా మైదానాల్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది.
హర్ కీ పౌరీ సహా అనేక ఘాట్ల వద్ద పారిశుధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూముల్లో మూత్రంతో నిండిన సీసాలు, పాత బట్టలు, చెప్పులు, వ్యర్థాల కుప్పలు దర్శనమిచ్చాయి. యాత్రికులు వదిలి వెళ్లిన కన్వర్ పరికరాలు, ఇతర చెత్త వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ అపరిశుభ్రతను కళ్లకు కడుతున్నాయి.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం ఆగస్టు 18 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ను చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. ఈ శుభ్రత పనుల కోసం సుమారు 1,000 మంది ప్రత్యేక పారిశుధ్య కార్మికులను నియమించారు. వ్యర్థాలను తరలించేందుకు 80కి పైగా వాహనాలను సిద్ధం చేశారు.
ముందుపెన్నడూ లేని విధంగా, ఈసారి డ్రోన్ కెమెరాల సాయంతో చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి, వెంటనే క్లీనింగ్ సిబ్బందిని పంపే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వ్యర్థాలు నిండిన వెంటనే హెచ్చరికలు పంపే ‘సోలార్ సెన్సార్’ డస్ట్బిన్లను ప్రయోగాత్మకంగా అమర్చారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పవిత్రమైన గంగా తీరాలను తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


