బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం తాజాగా ‘నమ్మ మెట్రో’లోని ఎల్లో లైన్ను తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలె వరకు 10.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్గా పొడిగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మార్గంలో తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదిక ప్రకారం, ఈ విస్తరణ యెల్లో లైన్ ప్రస్తుత టెర్మినల్ స్టేషన్ అయిన బొమ్మసంద్ర నుండి ప్రారంభమై అత్తిబెలె వరకు కొనసాగుతుంది.
నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ వద్ద మొదటి స్టేషన్ ప్రతిపాదించారు. ఆ తర్వాత చందాపూర్ సర్కిల్, హాలే చందాపూర్, తిరుమగొండనహళ్లి, బలగారణహళ్లి, అత్తిబెలె ఇండస్ట్రియల్ ఏరియా, యాదవనహళ్లి, అత్తిబెలె మరియు అత్తిబెలె టెర్మినల్ స్టేషన్లు ఉంటాయి. హోసూరు వరకు మెట్రోను పొడిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నప్పటికీ, సాంకేతిక కారణాల దృష్ట్యా కర్ణాటక వెనుకడుగు వేసింది.
ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ (750V DC థర్డ్ రైల్ vs 25kV AC ఓవర్ హెడ్), కోచ్ల సామర్థ్యం, భూసేకరణ, ఆదాయ పంపిణీ వంటి అంశాలలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీనివల్ల రెండు రాష్ట్రాలు తమ సరిహద్దుల వరకు మెట్రోను నిర్మించుకుని, అత్తిబెలె వద్ద 90 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జితో అనుసంధానించడమే ఉత్తమమని బీఎంఆర్సీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు టెండర్లు త్వరలోనే ఆహ్వానించనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఇంధన కొరత ఎఫెక్ట్: రాత్రి 8 గంటలకే మార్కెట్లు బంద్!


