బెంగళూరు సమీపంలో టెకీ అదృశ్యం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో నెలమంగల దగ్గర ప్రముఖ పుణ్యక్షేత్రం శివగంగ కొండపైకి ట్రెక్కింగ్కు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. బెంగళూరు కాడుగోడి మైత్రి లేఔట్ నివాసి అద్వైత్ ఉపాధ్యాయ(31) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ 4 రోజుల క్రితం బుల్లెట్ బైక్పై శివగంగకు వెళ్లి పార్కింగ్ స్థలంలో బండిని నిలిపాడు. తరువాత కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అతని జాడ మాయమైంది.
ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 60 మంది పోలీసులు డ్రోన్ల సాయంతో కూంబింగ్ ప్రారంభించారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. కాగా, అద్వైత్ కొండపైకి చేరుకోగానే తాను నిశ్చితార్థం చేసుకున్న యువతికి ట్రెక్కింగ్ ఫోటోలు పంపించాడు. ఇంట్లో అతని ల్యాప్టాప్ను పోలీసులు పరిశీలించగా, ఎలా ఆత్మహత్య చేసుకోవాలో గూగుల్లో వెతికినట్లు రికార్డయింది. ముఖ్యంగా శివగంగ కొండ మీద శాంతలా డ్రాప్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చా అంటూ ఏఐ టూల్స్ని అడిగాడు. దీంతో అద్వైత్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.


