సాక్షి, జగిత్యాల: కేవలం రూ.500 విషయంలో జరిగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. తన యజమాని వద్ద రావాల్సిన డబ్బులు అడిగిన ట్రాక్టర్ డ్రైవర్పై దాడి జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. వెల్దుర్తికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమేశ్కు తన యజమాని వద్ద రూ.500 రావాల్సి ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో రమేశ్ ఫోన్లో యజమానిని మందలించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి రమేశ్ ఇంటికి వెళ్లి ‘నన్నే తిడుతావా?’ అంటూ తన భార్య, పిల్లల ఎదుటే రమేశ్పై ఇద్దరూ కలిసి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో రమేశ్ స్పృహ కోల్పోయి కిందపడిపోయినట్లు తెలిపారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం.
అయితే తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగారెడ్డితో పాటు మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రమేశ్కు భార్య, కుమారుడు ఉన్నారు. రూ.500 కోసం తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


