నల్లబెల్లి: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లికి వచ్చారు. నల్లబెల్లిలో.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ చిత్ర పటానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేసీఆర్ రాకతో అక్కడకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఇటీవల పెద్ది సుదర్శన్రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున 2.25 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉండడంతో ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేస్తారు. పెద్ది సుదర్శన్రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ ఇటీవలే తెలిపారు.


