దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి పరామర్శ
9న నల్లబెల్లిలో జరిగే సంస్మరణ సభకు కేటీఆర్, 10న హనుమకొండ సభకు హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల దివంగతులైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. ఈ నెల 9న నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది నివాసంలో ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో కేసీఆర్ భేటీ అవుతారు. ఇదిలా ఉంటే ఈ నెల 9, 10 తేదీల్లో పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 9న నల్లబెల్లిలో జరిగే సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు.
10న హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగే సంస్మరణ సభకు మాజీ మంత్రి హరీశ్రావు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సంస్మరణ సభల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు మంగళవారం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సుమారు 30 మంది ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి అంత్యక్రియలకు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో నేతలు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో జరిగే సంస్మరణ సభ, దశ దినకర్మకు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నల్లబెల్లిలో చేయాల్సిన ఏర్పాట్లపై నేతలు చర్చించారు.


