సాక్షి, హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని బోనాల సందర్భంగా 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. బోనాల సందర్భంగా ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డ్రోన్ కెమెరాలతో లైవ్ ఫీడ్ తీసుకుంటున్నామన్నారు.
ఈ సారి అమ్మవారిని 60 వేల నుంచి 70 వేల మంది వరకు భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని దీనికోసం రెండు షిప్టులలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సంవత్సరం బోనాల సందర్భంగా ప్రజలు సహకరిస్తున్నారని హైదరాబాద్ పోలీసు తరపున ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు ఆషాడమాస బోనాలలో చివరిఘట్టమైన లాల్దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమర్పించారు. నగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దరిలిల్లుతున్నాయి.
పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపనున్నారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండలో 8వ బోనం పూజ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


