సాక్షి, హైదరాబాద్: ఆషాఢమాసం బోనాల జాతరలో ఆదివారం ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరిగింది. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమర్పించారు. నగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దరిలిల్లుతున్నాయి.

పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపనున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండలో 8వ బోనం పూజ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.




