కళకాలం గుర్తులు | 1500 Years of Indian Visual Story telling at Bengaluru | Sakshi
Sakshi News home page

కళకాలం గుర్తులు

Aug 9 2026 12:48 AM | Updated on Aug 9 2026 12:48 AM

1500 Years of Indian Visual Story telling at Bengaluru

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌

ప్రాచీన ఆలయ శిల్పాల నుంచి అమర చిత్ర కామిక్స్‌ వరకు సుప్రసిద్ధ భారతీయ శిల్ప, చిత్రకళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బెంగళూరులోని ‘మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఫొటోగ్రఫీ’లో తాజాగా ఏర్పాటు చేసిన ‘ఎ మూవింగ్‌ లైన్‌: 1500 ఇయర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ విజువల్‌ స్టోరీ టెలింగ్‌’ ఎగ్జిబిషన్‌ ద్వారా మన దేశ కళారంగం కాలంతో పాటు ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకోవచ్చు. ప్రఖ్యాత గ్రాఫిక్‌ రచయిత్రి అమృత పాటిల్‌ ఆధ్వర్యంలో ఈ చిత్రప్రదర్శన జరుగుతోంది...

 ప్రాచీన కళాసంప్రదాయాల నుంచి సమకాలీన డిజిటల్‌ స్టోరీ టెలింగ్‌ వరకు రకరకాల కళాకృతులు ‘ఏ మూవింగ్‌ లైన్‌’లో కనువిందు చేస్తాయి. ‘భారతదేశం అంటేనే కథకులు, కళాకారుల దేశం’ అంటారు అమృత పాటిల్‌.

వెస్ట్రన్‌ సెటైర్‌ నుంచి స్ఫూర్తి పొందిన బెంగాలీ ఇల్యుస్ట్రేషన్లు, మన దేశంలోని రాజకీయ కార్టున్‌లు,  చారిత్రాత్మక ప్రాధాన్యతను తెలియచేసే కార్టూన్‌లు, సామాజిక కట్టుబాట్లను సవాలు చేసే కార్టూన్‌లు, అసమ్మతి గళం విప్పిన శక్తిమంతమైన కార్టూన్‌లు, మహిళ కార్టూనిస్ట్‌ సుఖలత రావు గీసిన కార్టూన్‌లు, కామిక్స్‌పై బాలీవుడ్‌ ప్రభావాన్ని చూపించే చిత్రాలు (ఉదా: సామాజిక న్యాయం థీమ్‌తో క్రియేట్‌ చేసి బహుదూర్, సుప్రీమో పాత్రలు) ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి.

1990ల చివరి నాటికి భారతీయ గ్రాఫిక్‌ కథనాలు సంప్రదాయ సూపర్‌ హీరో కథలను దాటి సంక్లిష్టమైన సామాజిక సమస్యల దగ్గరకు వెళ్లాయి. ఈ క్రమంలో మంజులా పద్మనాభన్‌లాంటి ఆర్టిస్ట్‌లు తెర మీదికి వచ్చారు. గ్రాఫిక్‌ నవలలను ప్రధాన స్రవంతి ప్రచురణ రంగంలోకి తీసుకు రావడంలో ప్రచురణకర్త వి.కె.కార్తీక ప్రధాన పాత్ర పోషించారు. 

చోళుల కాలం నాటి ప్రాచీన హలసూరు సోమేశ్వర ఆలయ కళను హైలైట్‌ చేసే చిత్రాలు, అత్యంత పురాతన దృశ్యకళారూపాలలో ఒకటైన ‘వీరగల్లు’... మొదలైన వాటికి సంబంధించిన చిత్రాలు ఈ ఎగ్జిబిషన్‌లో కనిపిస్తాయి. బెంగళూరు తరువాత ‘ఎ మూవింగ్‌ లైన్‌’ ఎగ్జిబిషన్‌ ప్రఖ్యాత ఫ్రెంచ్‌ కామిక్‌ మ్యూజియం ‘సిటీ ఇంటర్నేషనల్‌ డి లా బాండే డిస్నీ’లో ఏర్పాటుకానుంది.
 
పురాణకథలు ఆధునిక కోణంలో...
గోవాలో పెరిగిన అమృత పాటిల్‌ ‘గోవా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ లో బీఎఫ్‌ఏలో డిగ్రీ, బోస్టన్‌లోని ‘స్కూల్‌ ఆఫ్‌ ది మ్యూజియం ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’లో మాస్టర్స్‌ చేశారు. తన తొలి గ్రాఫిక్‌ నవల ‘కరి’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నవలతో ఫస్ట్‌ ఫిమేల్‌ గ్రాఫిక్‌ నవలారచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కరి’ తరువాత వచ్చిన రెండు గ్రాఫిక్‌ నవలలు... ఆదిపర్వ, సౌప్తిక్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. మహాభారతంలోని కథలను గంగ, అశ్వత్థామ దృక్కోణం నుంచి తిరిగి చెప్పే కథలు ఇవి. ఈ నవలల ద్వారా పురాణ కథలను వర్తమానానికి దగ్గరగా తీసుకువచ్చారు. అమృత రచనలు ఫ్రెంచ్, ఇటాలియన్‌ భాషలలోకి అనువాదం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement