అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై 2023లోనే సుప్రీంకోర్టుకు ఏపీ | YSRCP in Parliament | Sakshi
Sakshi News home page

అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై 2023లోనే సుప్రీంకోర్టుకు ఏపీ

Aug 11 2026 5:35 AM | Updated on Aug 11 2026 5:35 AM

YSRCP in Parliament

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు 

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక చేపడుతున్న ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసిందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్‌–1 (కేడబ్ల్యూడీటీ–1) 1976 అవార్డు ప్రకారం కర్ణాటకకు మొత్తం 734 టీఎంసీల నీరు కేటాయించినట్లు తెలిపారు. ఎగువ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక కేటాయించిన 29.90 టీఎంసీల నీటి వినియోగం కేడబ్ల్యూడీటీ–1 కింద ఆ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల పరిధిలోనే ఉందని కేంద్ర జలసంఘం పరిశీలనలో తేలిందన్నారు. దీంతో అంతర్రాష్ట్ర కోణంలో ప్రాజెక్టును ఆమోదయోగ్యంగా గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టం చేశారు.  

20 శాతానికి మించి ఇథనాల్‌పై నిర్ణయం తీసుకోలేదు 
పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్‌ కలపడంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుశాఖ సహాయమంత్రి సురేశ్‌ గోపీ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. భవిష్యత్‌లో శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు, సంబంధిత భాగస్వాములతో సంప్రదింపుల అనంతరమే ఇథనాల్‌ మిశ్రమాన్ని పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నియామకాలు, బదిలీల్లో ఆన్‌లైన్‌ విధానం అవసరం
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకమైన, పటిష్టమైన, సాధ్యమైనంతవరకు ఆన్‌లైన్‌ విధానాన్ని పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచిస్తున్నట్లు కేంద్ర కారి్మక, ఉపాధిశాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ చెప్పారు. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఉపాధ్యాయుల నియామకం, వారి సరీ్వస్‌ పరిస్థితులు, పోస్టింగులకు సంబంధించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పరిధిలోనే ఉంటాయని తెలిపారు. 

విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో దేశంలోని మెజారిటీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన నియంత్రణలో ఉన్నా­యని పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల్లో పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయత పెంచడంతో పాటు అక్రమాలను నిరోధించేందుకు పార్లమెంట్‌ 2024లో పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టాన్ని తీసుకొచి్చందని గుర్తుచేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా స్వీకరించవచ్చని చెప్పారు.  

తిరుపతిలో నవోదయ విద్యాలయానికి అనుమతి లేదు 
తిరుపతి జిల్లాలో కొత్త జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలోని ప్రతిజిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది నవోదయ విద్యాలయ పథకం లక్ష్యమని తెలిపారు. 

అయితే కొత్త విద్యాలయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియగా ఉంటుందని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అనువైన భూమిని సమకూర్చడంతో పాటు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలిక భవనాన్ని ఉచితంగా అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు నవోదయ పథకం పరిధిలో ఉన్నాయని, ప్రకాశం (ప్రస్తుతం మార్కాపురం), తూర్పుగోదావరి (ప్రస్తుతం పోలవరం) జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల ప్రాతిపదికన మంజూరైన మరో రెండు విద్యాలయాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. మొత్తం రాష్ట్రంలో 15 నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని చెప్పారు.

సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం
రాజ్యసభలో బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి 
సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం 
సాక్షి, న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు. రాజ్యసభలో సోమ­వారం బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లు–2026పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పాత చట్టాలను ఆధునికీకరిస్తూ సాంకేతికతను జోడించి ఈ బిల్లును తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.  బ్యాంకింగ్‌ రంగానికి చట్టబద్ధమైన ప్రామాణిక ఫారం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫారాన్ని జారీచేసే బ్యాంకు అధికారి.. కంప్యూటర్, క్లౌడ్‌ వ్యవస్థల డేటా సమగ్రతను (ఇంటిగ్రిటీని) ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. 

ఒక సామాన్య బ్యాంకు అధికారికి క్లౌడ్‌ డేటా భద్రతను ధ్రువీకరించడం కష్టసాధ్యమనే విష యాన్ని ఆరి్థకమంత్రి పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బిల్లులోని క్లాజ్‌ 14 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆదేశాలిచ్చే అవకాశం ఉండటం ఉపశమనం కలిగించే అంశమన్నారు. బిల్లుకు తమపార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement