కేంద్ర మంత్రితో వైఎస్సార్సీపీ ఎంపీలు
కేంద్ర కార్మికమంత్రి మన్సుఖ్ మాండవీయకు వైఎస్సార్సీపీ ఎంపీల వినతి
ఇతర విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలని మిథున్రెడ్డి విజ్ఞప్తి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరిన గురుమూర్తి.. ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరిన తనూజారాణి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్–95) పరిధిలోకి వచ్చే లక్షలాదిమంది విశ్రాంత ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈపీఎస్–95 నేషనల్ అజిటేషన్ కమిటీ సమర్పించిన వినతిపత్రాన్ని జతచేస్తూ వినతిపత్రం ఇచ్చారు.
పార్టీ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణితో కలిసి ఆయన సోమవారం పార్లమెంట్ భవన్లో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిథున్రెడ్డి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ మొత్తాన్ని గౌరవప్రదమైన రీతిలో పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అర్హులైన పెన్షనర్లందరికీ హైయర్ పెన్షన్ సదుపాయాన్ని తక్షణమే వర్తింపజేయాలన్నారు. ఈపీఎస్–95 పథకం పరిధిలోకి రాని ఇతర విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆర్థికభద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
మానవహక్కులకు విరుద్ధం
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఏళ్లకు ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రమంత్రిని కోరారు. ఏపీ మెడికల్–హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇచి్చన వినతిపత్రాన్ని జతచేస్తూ ఒక వినతిపత్రం ఇచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా కాంట్రాక్ట్ సిబ్బందికీ రెగ్యులర్ ఉద్యోగుల కనీస టైమ్స్కేల్కు సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారికి వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వకపోవడాన్నీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది శ్రామిక చట్టాలకు, వారి మానవ హక్కులకు విరుద్ధమని చెప్పారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తున్న అందరికీ ఒకేవిధంగా వేతనం ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడావసతులు పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉన్న విద్యార్థులు, యువతను ప్రోత్సహించేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈ మేరకు ఆమె వినతిపత్రం ఇచ్చారు. అరకు కేంద్రంగా ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్–అరకు పేరుతో ప్రత్యేక క్రీడాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడావసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు ప్రత్యేక ఆసక్తి ఉండే విలువిద్య, షూటింగ్ వంటి విభాగాలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గిరిజన బాలబాలికల కోసం క్రీడాహాస్టళ్లు లేదా రెసిడెన్షియల్ అకాడమీలు నెలకొల్పాలని కోరారు. ఈ సదుపాయాలను ‘ఖేలో ఇండియా’ పథకంతో అనుసంధానించాలని విన్నవించారు. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనూజారాణి చెప్పారు.
గ్రామీణ డాక్ సేవకుల కోసం కమిటీ వేయాలి
గ్రామీణ ప్రాంతాల పోస్టల్ సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామీణ డాక్ సేవకుల (జీడీఎస్ల) వేతన నిర్మాణం, సర్వీసు నిబంధనలను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి వినతిపత్రం అందించారు.


