సాక్షి,బెంగళూరు: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ప్రదూష్ ఎస్. రావు అప్రూవర్గా మారడానికి బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. 2024 జూన్ 8న బాధితుడిని చిత్రహింసలు పెట్టి దాడి చేస్తున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని, రేణుకాస్వామిని దర్శన్ ఏవిధంగా చిత్ర హింసలకు గురి చేశాడు. ఆయన ప్రాణాలు తీశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఫేక్ కేసు ఎలా సృష్టించారనే విషయాల్ని కోర్టుకు వివరించారు.
అయితే, ప్రదోష్ రావు ‘అప్రూవర్’గా మారి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తుపై అభ్యంతరాలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దర్శన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చగా, ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
దర్శన్కు అత్యంత సన్నిహితుడైన ప్రదూష్ కోర్టులో క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేరానికి సంబంధించిన పూర్తి నిజాలను, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తూగుదీప పాత్రను వెల్లడించారు. రేణుకాస్వామిపై దాడి జరిగే సమయంలో దర్శన్ బాధితుడి ఛాతిపై నిలబడి పదే పదే తన్నాడు. ఆ తర్వాత తాను చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు కథను సృష్టించాడు.
దర్శన్ స్నేహితురాలు,సహనటి పవిత్ర గౌడ సోషల్ మీడియా పోస్టులపై అసభ్యకరమైన కామెంట్లు చేశారనే కోపంతో 2024 జూన్ 8న బెంగళూరులోని కామాక్షిపాళ్యలోని ఒక షెడ్డులో దర్శన్, ఇతరులు కలిసి రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ప్రదూష్ రావు తన వాంగ్మూలంలో.. నేను షెడ్డుకు చేరుకునేసరికి రేణుకాస్వామి నేలపై కూర్చున్నారు. అతని చుట్టూ పలువురు వ్యక్తులు ఉన్నారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడంటూ దర్శన్ అతన్ని దూషిస్తున్నాడు. పవిత్రను తన చెప్పుతో రేణుకాస్వామిని కొట్టమని కోరాడు. ఆ తర్వాత ఇతరులు వంతులవారీగా కర్రలతో కొట్టారు.
అనంతరం, దర్శన్ నైలాన్ తాటితో రేణుకాస్వామిపై దాడి చేశాడు. దర్శన్ రేణుకాస్వామి మెడపై, ఛాతిపై తన్నాడు. అతని గుండెలపై నిలబడ్డాడు. రేణుకాస్వామి ఫోన్ను నాకు ఇచ్చాడు. ఇతర మహిళలకు కూడా అలాంటి మెసేజ్లు ఏమైనా పంపాడో లేదో తనిఖీ చేయమని చెప్పాడు. ఈ దాడి ఇలాగే కొనసాగితే బాధితుడు చనిపోతాడని దర్శన్ను హెచ్చరించా. అయినప్పటికీ దర్శన్ రేణుకా స్వామిపై దాడిని ఆపలేదు. ఆ తర్వాత రేణుకాస్వామి మరణించినట్లు నటుడి డ్రైవర్ లక్ష్మణ్ నాకు చెప్పాడు.
ఈ మరణం గురించి చెప్పడానికి నేను దర్శన్ ఇంటికి వెళ్లా. ఆ తర్వాతే తప్పును కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు. నేను సహకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ బెదిరించాడు. ఆర్థిక వివాదానికి సంబంధించిన ఒక నకిలీ హత్య కథను దర్శన్ సృష్టించాడని, ఈ హత్య కేసులో లొంగిపోవడానికి నిందితులను వెతకమని ఇద్దరు వ్యక్తులకు రూ. 15 లక్షల నగదును బ్యాగ్లో పెట్టి ఇచ్చాడు.
రేణుకాస్వామి మృతదేహాన్ని ఒక తెల్లటి స్కార్పియోలో ఉంచి పారవేసేందుకు అనువైన ప్రాంతం కోసం వెతికారు. చివరికి దానిని ఒక డ్రైనేజీ సమీపంలో పడేశారు. ఘటన జరిగి రెండు రోజుల తర్వాత పలువురు వ్యక్తులు పోలీసు స్టేషన్లో లొంగిపోగా, తాను మరికొందరితో కలిసి పోలీసులకు పట్టుబడ్డానని రావు తెలిపారు.


