సాక్షి,కోల్కతా: కోల్కతాలోని నీల్రతన్ సర్కార్ (NRS) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నర్సు అనుమానాస్పద మరణం కలకలం రేపింది. బుధవారం రాత్రి ఆమె మృతదేహం టాయిలెట్లో లభ్యమైంది. మరణించిన నర్సును 30 ఏళ్ల రూపాలి బర్మన్ (Rupali Burman)గా గుర్తించారు. నర్సు మృతిపై తక్షణమే స్పందించిన పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
ఈ ఘటనపై జాయింట్ సీపీ (క్రైమ్) కునాల్ అగర్వాల్ అందించిన సమాచారం ప్రకారం రూపాలి బర్మన్ ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగానికి చెందిన హైడిపెండెన్సీ యూనిట్ (HDU)లో పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి డ్యూటీ సమయంలో ఒక రోగికి సేవలు అందించిన తర్వాత ఆమె HDU రెస్ట్రూమ్కి (టాయిలెట్) వెళ్లారు. ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది 10:27 గంటల ప్రాంతంలో తలుపు తట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, రూపాలి అచేతనంగా పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రి ఎమర్జెన్సీకి తరలించినప్పటికీ, వైద్యులు పరీక్షించేలోపే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నపోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుల్స్ : సుప్రీం సీరియస్, కేంద్రానికి అల్టిమేటం
ఈ కేసును కోల్కతా పోలీసులకు చెందిన డిడి హోమిసైడ్ డిపార్ట్మెంట్ (DD Homicide Department) విచారణకు స్వీకరించింది. టాయిలెట్ వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిని ఆత్మహత్యగా ధృవీకరించలేదు. NRS నర్సు అనుమానాస్పద మృతిపై పోలీసులు జరుపుతున్న దర్యాప్తుతో పాటు, ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక విచారణను ప్రారంభించింది. దీనికోసం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు; ఈ కమిటీ ఏడు రోజుల్లోగా ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: 360 ఎకరాల ‘దెయ్యాల నగరం’ : రూ. 13.3 కోట్లకు వ్యాపారవేత్త డీల్


