కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై హాలిషహర్లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో తన కారుపై దాడి చేశారని, ఈ ఘటనలో తాను ప్రాణాలు కూడా కోల్పోయి ఉండేదాన్నని మమతా బెనర్జీ అన్నారు. తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. రాళ్లు, ఇటుకలు తనను తాకి ఉంటే ప్రాణాపాయం జరిగేదని అన్నారు. “బయటి ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు పోలీసుల ఎదుటే నా కారుపై రాళ్లు విసిరాయి. కారు అద్దాలు మూసి లేకపోతే నా తల పగిలిపోయేది. నేను చనిపోయి ఉండేదాన్ని. ఇలాంటి దాడిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మమ్మల్ని రక్షించేందుకు పోలీసులు ఏమీ చేయలేదు. వారు బీజేపీకే రక్షణ ఇస్తున్నారు” అని ఆమె అన్నారు.
మమతా బెనర్జీతో పాటు ఉన్న లోక్సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ సభ్యురాలు డోలా సేన్ కూడా బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలీసులను ఉపయోగించి ముఖ్యమంత్రి సువేందు అధికారి పాలన నడుపుతున్నారు” అని కల్యాణ్ బెనర్జీ అన్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర ఓటమి తర్వాత, మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నియోజకవర్గంలో దాడిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీకి కూడా అటువంటి అనుభవమే ఎదురైంది.


