తాడేపల్లి : విజయ డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. అందుకే డెయిరీ చైర్మన్ను ఇద్దరు మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని విమర్శించారు. చివరికి డైరెక్టర్లను కూడా మంత్రి కొల్లు రవీంద్ర తన ఇంట్లో బంధించారన్నారు. మరో వైశ్రాయ్ హోటల్ తరహా వెన్నుపోటు డ్రామాకు తెరలేపారన్నారు అనిల్ కుమార్.
‘ఎండీ, ఇతర అధికారుల మీద కేసులు పెడతామని బెదిరించారు. ఛైర్మన్ తో రాజీనామా చేయించకపోతే విదేశాల్లో ఉన్న పిల్లల మీద కేసు పెడతామని బెదిరించారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని నిర్వీర్యం చేసినట్లే ఇప్పుడు విజయ డెయిరీ మీద పడ్డారు. చలసాని ఆంజనేయులుని బలవంతంగా రాజీనామా చేయించాల్సిన అవసరం ఏంటి?, ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్లి మరీ ఎందుకు బెదిరించారు?, ఇప్పటిదాకా ఆర్టీసీ డిపోల నుంచి మద్యం షాపుల వరకు అన్నిటినీ పంచుకు తిన్నారు.
ఇప్పుడు విజయ డెయిరీ ఆస్తులను కూడా కొల్లగొట్టబోతున్నారు. సహకార సంస్థగా ఉన్న విజయ డెయిరీని ఎందుకు నిర్వీర్యం చేస్తారు?, విజయ డెయిరీ ప్రభుత్వానిది కాదు, రైతులది. రైతుల మీద కూడా రెడ్ బుక్ను ప్రయోగిస్తారా?, మా హయాంలో ఎప్పుడూ విజయ డెయిరీ గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు ఇప్పుడు ఏ స్వార్ధంతో చలసానిని రాజీనామా చేయించారు?, రాష్ట్రంలో రైతులు యూరియా అందక, గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ముందు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి’ అని హెచ్చరించారు.


