భోపాల్: మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో సర్కోహా గ్రామానికి చెందిన గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలు 17.96 క్యారెట్ల వజ్రాన్ని గుర్తించారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఈ రత్నం విలువ రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. అయితే, కచ్చితమైన విలువ ప్రభుత్వ వేలం తర్వాతే తేలనుంది. ఈ కార్మికులు రోజువారీ కూలి పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ వజ్రం దొరకడంతో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశం వచ్చింది.
వర్షం సమయంలో వజ్రం మెరుపులు
ఈ వజ్రం సర్కోహా గ్రామంలోని గనిలో దొరికింది. వర్షం పడుతున్న సమయంలో ఏడుగురు కార్మికులు గనిని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో లీజుదారు అఖిలేశ్ పాల్ మట్టిలో ఏదో మెరుస్తున్న వస్తువును గమనించారు. దగ్గరగా పరిశీలించగా అది వజ్రమని గుర్తించారు. ఈ విషయం గ్రామంలో, సమీప ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో కార్మికులు, స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది.
వేలం ద్వారా విలువ నిర్ణయం
నిపుణులు, వజ్ర కార్యాలయం అంచనా ప్రకారం 17.96 క్యారెట్ల వజ్రం విలువ రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చు. అమల్లో ఉన్న విధానం ప్రకారం, వేలం ద్వారా వచ్చే మొత్తంలో నుంచి ప్రభుత్వ రాయల్టీ మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలకు సమానంగా పంచుతారు.
ముగ్గురు కార్మికులకు పెళ్లి ఆశ
సంతోష్, శర్మన్, అరుణ్ కుటుంబాలకు ఈ వజ్రం బాగా ఉపశమనం ఇచ్చేలా దొరికింది. 30 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్న వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు వివాహం చేసుకోలేకపోయారు. వజ్రం అమ్మకం ద్వారా తమకు వచ్చే వాటాతో కుటుంబ జీవితం ప్రారంభించే ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లగలమని వారు భావిస్తున్నారు. ఈ వజ్రం తమ ఉమ్మడి కృషి, కష్టానికి ఫలితమని ఏడుగురు కూలీలు తెలిపారు. గనిలో అందరూ కలిసి పనిచేయడంతో, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగిలే మొత్తాన్ని సమానంగా పంచుకుంటారు.
ఇళ్లు కట్టుకోవాలని..
తమకు వచ్చే ఆదాయాన్ని ఎలా వినియోగించాలనే అంశంపై కార్మికులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇళ్ల స్థానంలో శాశ్వత గృహాలు నిర్మించుకోవడం, పిల్లలకు మెరుగైన విద్య అందించడం వారి ప్రధాన లక్ష్యాలు. 17.96 క్యారెట్ల వజ్రాన్ని పన్నాలోని ప్రభుత్వ వజ్ర కార్యాలయంలో భద్రత నడుమ జమ చేశారు. అవసరమైన చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు పూర్తైన తర్వాత దానిని వేలం వేస్తారు.


