Photo Credit: Twitter
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ కార్యాలయానికి బెదిరింపు లేఖలు వస్తున్నట్లు తేలింది. అయితే మొదట్లో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు.
అయితే అదే పనిగా లేఖలు వస్తుండడంతో తాజాగా గంగూలీ మేనేజర్ తానియా భట్టాచార్య దక్షిణ కోల్కతాలోని ఠాకూర్పూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గంగూలీ, అతని భార్య డోనాతో పాటు వారితో సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తులకు కూడా హాని చేస్తామని బెదిరిస్తూ గంగూలీ కార్యాలయానికి సోమవారం కూడా రెండు లేఖలు అందాయని మేనేజర్ స్పష్టం చేశారు.
అయితే ఈ సంఘటనపై సౌరవ్ గంగూలీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. బెదిరింపు లేఖలు రావడంపై గంగూలీ మేనేజర్ మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


