స్నానం చేస్తుండగా ఫొటోలు.. బ్లాక్‌మెయిల్‌తో గ్యాంగ్‌రేప్‌..! | Five sentenced to life imprisonment in minor girl Incident | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తుండగా ఫొటోలు.. బ్లాక్‌మెయిల్‌తో గ్యాంగ్‌రేప్‌..!

Jul 16 2026 9:50 AM | Updated on Jul 16 2026 9:50 AM

Five sentenced to life imprisonment in minor girl Incident

జగిత్యాలజోన్‌: మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డ కేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణారావు కథనం ప్రకారం.. మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంట్లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన లోకిని రాజేశ్‌ ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను అందరికీ చూపిస్తానంటూ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెపితే ‘నిన్ను నీ కుటుంబసభ్యులను చంపేస్తా’ అంటూ బెదిరించాడు. ఇలా, బాలికను ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ నేపథ్యంలో 6 అక్టోబర్‌ 2020 రోజున ‘నీతో, నీ స్నేహితుడు మాట్లాడతా అంటున్నాడు, బయటకు రా’ అంటూ సదరు బాలికకు రాజేశ్‌ ఫోన్‌ చేశాడు. బాలిక బయటకు రాగానే పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశాడు. రాజేశ్‌ అత్యాచారం చేస్తున్న సమయంలో, అక్కడికి వచ్చిన అతడి నలుగురు స్నేహితులు దరంగుల సాయికుమార్, మొగిలిపాక అనిల్‌కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్‌ను బాలిక చూసి, ‘నన్ను ఏమి చేయవద్దు’ అని బతిమిలాడినా ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటూ అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, ఫొటోలు, వీడియోలు బయటపెట్టి, నీ జీవితాన్ని నాశనం చేస్తామంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

అపస్మారక స్థితిలోకి వెళ్లి, నడవలేని స్థితిలో ఉన్న ఆ బాలిక అక్కడి నుంచి మెళ్లగా ఇంటికి చేరుకుంది. ఇంటి పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా ఆ భాదను తనలోనే దాచుకుంది. చివరకు జరిగిన ఘటనను తమ కుటుంబసభ్యులకు తెలియజేయగా, మెట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై ఎన్‌.సదాకర్‌ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ ఎండీ గౌస్‌బాబా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. తర్వాత వచ్చిన డీఎస్పీ వి.రవీందర్‌రెడ్డి కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, కోర్టులో నిందితులపై చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, డి.శ్రీధర్, బి.రాజు బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితులకు యావజ్జీవ శిక్ష, జరిమానా విధించారు. భాదితురాలికి రూ.12 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement