సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం టూటౌన్ పరిధిలో బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గరీబ్పేటకు చెందిన మార్తి రామకృష్ణ ఓ బాలికను ప్రేమపేరుతో వేధించాడు. ఆ తర్వాత ఆమెను జాలె నవీన్, గణేశ్ సహకారంతో ఈ నెల 3వ తేదీన తన బావ, కానిస్టేబుల్ వెంకటేశ్ గదికి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడని తెలిపారు.
తరువాత స్నేహితులైన కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్కు చెప్పగా వారు కూడా ఈనెల 4, 5వ తేదీల్లో వేర్వేరుగా బాధితురాలిని భయపెట్టి ఆటోల్లో తీసుకువెళ్లి లైంగికదాడి చేశారని వివరించారు. ఈ విషయమైబాలిక ఈ నెల 11న తల్లికి తెలపగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి బుధవారం మార్తి రామకృష్ణ, కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్, బాలె నవీన్ను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు ఆటోలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల్లో కానిస్టేబుల్ వెంకటేశ్తో పాటు గణేశ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. వన్టౌన్ సీఐ కరుణాకర్, టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


