హైడ్రోజన్‌ రైలుకు స్పందన కరువు!? | India First Hydrogen Train Rs5 ticket Why low Passenger count | Sakshi
Sakshi News home page

హైడ్రోజన్‌ రైలుకు స్పందన కరువు!?

Jul 22 2026 6:45 PM | Updated on Jul 22 2026 7:06 PM

India First Hydrogen Train Rs5 ticket Why low Passenger count

భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ రైలును హర్యానాలోని జింద్‌–సోనిపట్‌ మార్గంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ఈ రైలును ప్రారంభించారు. 10 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్‌ రైలు సెట్‌లలో ఒకటిగా నిలిచింది.

అత్యాధునిక సౌకర్యాలు, కేవలం రూ.5 నుంచి రూ.25 మధ్యే టికెట్‌ ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రారంభ రోజుల్లో ప్రయాణికుల స్పందన ఆశించిన స్థాయిలో కనిపించలేదు. తొలి రోజు జింద్‌ నుంచి బయలుదేరిన రైలులో సాధారణ ప్రయాణికులు సుమారు 20 మంది మాత్రమే ప్రయాణించగా, రెండో రోజూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎందుకు తక్కువ మంది ప్రయాణిస్తున్నారు?

రైల్వే వర్గాల అంచనా ప్రకారం, జింద్‌–సోనిపట్‌ మార్గంలో ఇప్పటికే పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయాల కొరత లేదు. కొత్త హైడ్రోజన్‌ రైలు గురించి ఇంకా చాలామందికి పూర్తి అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ప్రచారం పెరిగి, ప్రజల్లో విశ్వాసం ఏర్పడిన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

హైడ్రోజన్‌ రైలు ఎలా పనిచేస్తుంది?

సాంప్రదాయ డీజిల్‌ ఇంజిన్‌కు బదులుగా ఈ రైలు హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ సాంకేతికతను ఉపయోగిస్తుంది. హైడ్రోజన్‌, గాలిలోని ఆక్సిజన్‌ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి మోటార్లను నడుపుతుంది. ఈ ప్రక్రియలో పొగ లేదా కార్బన్‌ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడంతో ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.

ప్రత్యేకతలు ఇవే..

🔹 10 కోచ్‌లతో సుమారు 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యం.
🔹 మెట్రో తరహా ఆటోమేటిక్‌ డోర్లు.
🔹 డిజిటల్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ డిస్‌ప్లేలు.
🔹 పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ.
🔹 హైడ్రోజన్‌ లీకేజ్‌, మ​​ంటలు, ఉష్ణోగ్రతలను గుర్తించే బహుళ భద్రతా వ్యవస్థలు.
🔹 జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్‌ నిల్వ, రీఫ్యూయలింగ్‌ మౌలిక సదుపాయాలు.
🔹 గరిష్ఠ డిజైన్‌ వేగం గంటకు 110 కి.మీ.( ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 75 కి.మీ. వేగంతో నడుస్తోంది)

హైడ్రోజన్‌ ఆధారిత రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరింది. భవిష్యత్తులో పూర్తిగా విద్యుదీకరణ సాధ్యం కాని మార్గాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి రైళ్ల వినియోగాన్ని విస్తరించే దిశగా భారతీయ రైల్వేలు ఈ ప్రాజెక్టును పైలట్‌గా ఉపయోగించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement